Type Here to Get Search Results !

6/7/18 నేటి విద్యా విషయక వార్తలు

నేడు టెన్త్‌ ‘సప్లిమెంటరీ’ ఫలితాలు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 10 గంటలకు సచివాలయంలోని తన చాంబర్‌లో ఫలితాలను విడుదల చేస్తారు.

టీచర్ల పరస్పర బదిలీలకు ఒకే

‘స్థానికత’తో సంబంధం లేదు
మేనేజ్‌మెంట్లు వేరైనా పర్వాలేదు
ఒకే సబ్జెక్టు వారికే అవకాశం
‘ఎయిడెడ్‌’ నుంచి ‘ఎయిడెడ్‌’కే అనుమతి
కాలేజీలు, యూనివర్సిటీల లెక్చరర్ల ‘పరస్పరాని’కీ సమ్మతి
ఉభయ రాష్ట్రాల పునర్విభజన కమిటీ భేటీలో నిర్ణయాలు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య టీచర్లు, లెక్చరర్ల బదిలీల విషయంలో ముందడుగు పడింది. చాలా కాలం నుంచి చిక్కుముడిలా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. స్టేట్‌ కేడర్‌కే కాదు...లోకల్‌ కేడర్‌ ఉద్యోగులకూ ‘విభజన నష్టం’ జరగకూడదన్న విశాల దృక్పథంతో సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. లోకల్‌ కేడర్‌ ఉద్యోగుల బదిలీలపై ఏర్పాటైన ఉభయ రాష్ట్రాల పునర్విభజన కమిటీ ఈ మేరకు ప్రాథమికంగా పలు నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, స్టేట్‌ రీ-ఆర్గనైజేషన్‌ సెల్‌ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఏపీ స్టేట్‌ రీ-ఆర్గనైజేషన్‌ సెల్‌ అధికారి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ప్రేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దా్‌సలతో ఏర్పాటైన ఈ కమిటీ గురువారం మొట్టమొదటిసారిగా సమావేశమైంది. తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో టీచర్లు, లెక్చరర్ల పరస్పర బదిలీలు, భార్యాభర్తల కేసులపై చర్చించి కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే కమలనాథన్‌ కమిటీ స్పష్టత ఇచ్చింది.
దాదాపు 53 వేల మంది రాష్ట్ర కేడర్‌ ఉద్యోగులను ఇరు రాష్ట్రాల మధ్య విభజించింది. అయితే... జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ వంటి లోకల్‌ కేడర్‌ సిబ్బంది ఏ ప్రాంతంలో ఉంటే... అదే రాష్ట్రానికి చెందుతారంటూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో స్పష్టం చేసింది. కానీ... ఈ లోకల్‌ కేడర్‌ సిబ్బందికి కూడా న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇరు రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి, 2010 ఆగస్టులో ఉమ్మడి మార్గదర్శకాలను జారీ చేశాయి. ఆ మార్గదర్శకాల ప్రకారం పరస్పర, భార్యాభర్తల బదిలీలను పూర్తి చేశారు. కానీ... టీచర్లు, లెక్చరర్ల సమస్యే కొలిక్కి రాలేదు. దీంతో తాజా సమావేశంలో వీరి బదిలీలపై కమిటీ సుదీర్ఘంగా చర్చించి ప్రాథమికంగా పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలపై త్వరలో ఉమ్మడి ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

నిర్ణయాలు ఇవీ...
  • స్థానికతతో సంబంధం లేకుండా టీచర్ల పరస్పర బదిలీకి కమిటీ ఏకాభిప్రాయం.
  • ఒకే సబ్జెక్టు టీచర్లకు మాత్రమే అనుమతి. ఏపీ నుంచి గణితం టీచర్‌ తెలంగాణకు వస్తానంటే... తెలంగాణ నుంచి కూడా అదేటీచర్‌ ఏపీకి వెళ్లాలి.
  • ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ మేనేజ్‌మెంట్ల కింద పని చేస్తున్న టీచర్లు పరస్పరం బదిలీ చేసుకోవచ్చు. తెలంగాణ నుంచి ప్రభుత్వ టీచర్‌ ఏపీలోని పంచాయతీరాజ్‌ టీచర్‌గా, అక్కడి పంచాయతీరాజ్‌ టీచర్‌ ఇక్కడి ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా కూడా పరస్పరం బదిలీ చేసుకోవచ్చు.
  • రెండు రాష్ట్రాల్లోని ఎయిడెడ్‌ స్కూళ్ల టీచర్ల పరస్పర బదిలీలను అంగీకరిస్తారు. అయితే, ఎయిడెడ్‌ నుంచి ఎయిడెడ్‌ స్కూళ్లకే బదిలీ.
  • పరస్పర బదిలీల మాదిరిగానే భార్యాభర్తల కేసుల్లోనూ ‘మేనేజ్‌మెంట్‌’ నిబంధనలు వర్తిస్తాయి. స్థానికతను పెద్దగా పట్టించుకోరు. భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ విభాగం కింద, మరొకరు యూనివర్సిటీలో పని చేస్తున్నా బదిలీలకు అంగీకరిస్తారు.
  • ఇదివరకు జూనియర్‌, డిగ్రీ కాలేజీల లెక్చరర్లను యూనివర్సిటీలకు, యూనివర్సిటీల లెక్చరర్లను కాలేజీలకు బదిలీకి అనుమతించేవారు కాదు. ఇప్పుడలా కాకుండా... అర్హతలుంటే పరస్పర బదిలీలు చేసుకోవచ్చు.
  • మున్సిపల్‌ టీచర్ల విషయంలో కమిటీ నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి ఏపీలో మున్సిపల్‌ ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. కానీ, తెలంగాణలో లేవు.

టీచర్‌ పోస్టులకు 2 నోటిఫికేషన్లు?

ఎస్‌జీటీ పోస్టులకు ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’!..
ఇతర కేటగిరీలకు ‘డీఎస్సీ’
బీఎడ్‌లకు ఎస్‌జీటీ అర్హత కల్పించడంతో సర్కారు సరికొత్త ఆలోచన
నేడు కీలక ప్రకటన
ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) పోస్టుల వరకు ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’ విధానంలోను, ఇతర కేటగిరీ పోస్టులకు డీఎస్సీ రూపంలో నోటిఫికేషన్లు విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఎస్‌జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులకూ అర్హత కల్పిస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో ఈ విధమైన అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. బీఎడ్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు కావాల్సిన టెట్‌లో అర్హత లేకపోవడంతో.. వారికి నష్టం లేకుండా ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’ పద్ధతిలో నోటిఫికేషన్‌ ఇచ్చి నియామకాలు చేయడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల సాంకేతికపరమైన సమస్యలు ఎదురుకాబోవని అనుకుంటున్నారు. డీఎస్సీ-2014లో పాఠశాల విద్యాశాఖ ఈ తరహాలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
ఇప్పుడు ఎస్‌జీటీ పోస్టుల వరకు అలాచేస్తే.. డీఎడ్‌లతో పాటు బీఎడ్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుని మెరిట్‌ ప్రాతిపదికన నియమితులయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అంశంపై శుక్రవారం కీలక ప్రకటన విడుదల కానుందని సమాచారం. ఇదిలా ఉండగా.. టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఆర్థికశాఖ గురువారం కసరత్తు ప్రారంభించింది. పాఠశాల విద్యాశాఖ గతంలో పంపిన ప్రతిపాదనలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రవిచంద్ర గురువారం విద్యాశాఖ అధికారులతో చర్చించారు. గతంలో ప్రతిపాదించిన కొన్ని పోస్టులకు సంబంధించి మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందన్న దానిపైనా చర్చించారు. ఈసారి స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్యను పెంచేలా కసరత్తు జరుగుతోంది. టీచర్‌ పోస్టులకు సంబంధించి మరింత అదనపు సమాచారం కావాలని పాఠశాల విద్యాశాఖను ఆర్థికశాఖ కోరింది. శుక్రవారం మరోసారి చర్చించి భర్తీ చేయదలచిన పోస్టులకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది.

పాత పద్ధతిలోనే భర్తీ!
డీఎస్సీ -2018 నిర్వహణ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించాలన్న ఆలోచనను సర్కారు వెనక్కు తీసుకుంది. ప్రస్తుత అమలులో ఉన్న విధానంలోనే భర్తీ చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. విశ్వవిద్యాలయాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ భర్తీకి సంబంధించిన స్ర్కీనింగ్‌ టెస్ట్‌ నిర్వహణలో తీవ్ర జాప్యం జరగడంతో డీఎస్సీ నిర్వహణ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించరాదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

డిఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా?

డిఎస్సీ నోటిఫికేషన్‌ను రాష్ట్రప్రభుత్వం వాయిదా వేయనుంది. రాష్ట్రంలో 10,351 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి శుక్రవారం డిఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. బిఇడి అభ్యర్థులకు ఎస్‌జిటి పోస్టులకు అర్హత కల్పిస్తూ ఇటీవల కేంద్రప్రభుత్వం ఈ నెల 3న గెటిటేడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రానున్న డిఎస్సీలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై విద్యాశాఖ ఏలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఎస్‌జిటి పోస్టులకు మళ్లీ టెట్‌ నిర్వహించాలా? అనే అంశంపై చర్చించేందుకు శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖనుంచి ఇంకా అనుమతి రాలేదు. పదో తరగతి సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన డిఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.

మున్సిపల్‌ మినహా టీచర్ల అంతర్‌ రాష్ట్ర బదిలీలకు ఓకే

- డిసెంబర్‌ వరకు అర్జీలకు అవకాశం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో:
ఉపాధ్యాయుల అంతరాష్ట్ర బదిలీలకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. బదిలీల్లో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి విభజన కమిటీ అధికారులు గురువారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మున్సిపల్‌ స్కూల్స్‌ పని చేస్తున్న ఉపాధ్యాయుల అంతరాష్ట్ర బదిలీలు మినహా ఇతర ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ బదిలీలకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ఈ ఏడాది డిసెంబర్‌ వరకు అవకాశం కల్పించాలని తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టం ప్రకారం టీచర్ల అంతరాష్ట్ర బదిలీల్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానికత ఆధారంగా చాలా వరకు ఉద్యోగుల విభజన పూర్తికాగా, ఉపాధ్యాయల పంపకాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా ఎపి మున్సిపల్‌ స్కూళ్లలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు నిబంధనలు అడ్డంకిగా మారాయి. స్థానికత ఆధారంగా మున్సిపల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న వారిని వారి సొంత రాష్ట్రానికి తీసుకురావడం కష్టంగా మారింది. ఎయిడెడ్‌ స్కూల్స్‌ ఉపాధ్యాయులతో పాటు భార్యాభర్తలైన ఉపాధ్యాయుల విషయంలోనూ కొన్ని ఇబ్బం దులు తలెత్తాయి. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల అంతరాష్ట్ర బదిలీలపై గురువారం రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. హెడ్‌ టూ హెడ్‌ బదిలీలతో పాటు జెడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను స్థానికత ఆధారంగా పరస్పర బదిలీలు చేయాలని నిర్ణయించారు. అది కూడా ఒకే సబ్జెక్టు కలిగిన పోస్టులు, అదే సినియార్టీ ఉన్న వారిని తక్షణం బదిలీలకు అనుమతించాలని నిర్ణయించారు. అయితే ఏపీలోని మున్సిపల్‌ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల విషయాన్ని మాత్రం తాత్కాలికంగా పక్కనపెట్టారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు సమానమైన కేడర్‌ పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడంతో పాటు యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌పై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున ఈ అంశంపై కోర్టు తీర్పు అనంతరం చర్చిద్దామని అధికారులు నిర్ణయించారు.
Tags