అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆగస్టులో ఇంటర్వ్యూలు
విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకోసం ఆగస్టులో ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ నెలాఖరుకల్లా నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 14 వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీచేసేందుకు వీలుగా వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసిన ఏపీపీఎస్సీ.. దరఖాస్తు చేసుకున్న 20వేల మంది అభ్యర్థులకు స్ర్కీనింగ్ నిర్వహించి మార్కులను విడుదల చేసింది. అన్ని వర్సిటీల్లో కలిపి 64 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహించగా.. ఇప్పటి వరకు 58 సబ్జెక్టుల్లో మార్కులను తన వెబ్సైట్లో ప్రదర్శించింది. మిగిలిన సబ్జెక్టుల మార్కులను కూడా విడుదల చేసే పనిలో ఉంది. వర్సిటీలు కేటగిరీల వారీగా నిర్ధేశించిన కటాఫ్ మార్కుల ప్రకారం ఇప్పటి వరకు 40సబ్జెక్టులకు సంబంధించి స్ర్కీనింగ్ టెస్ట్లో అర్హులైన అభ్యర్థుల జాబితాలను ఏపీపీఎస్సీ సిద్ధంచేసింది. ఆ జాబితాలను వచ్చే వారంలో సంబంధిత విశ్వవిద్యాలయాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అన్ని వర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించి ఇంటర్వ్యూల నిర్వహణతోపాటు నియామక ప్రక్రియ షెడ్యూల్ను ఖరారు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 మధ్య ఇంటర్వ్యూలను నిర్వహించేలా ప్రాథమికంగా షెడ్యూల్ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా... ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ప్రక్రియను వాయిదా వేయాల్సిందిగా తాజాగా యూజీసీ లేఖ రాసినప్పటికీ.. రాష్ట్రంలో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి ప్రతిబంధకం కాదని ఉన్నత విద్యా మండలి వర్గాలు పేర్కొంటున్నాయి.