డిఎస్సీ ఎప్పుడు?

- - మూడు వారాలుగా సిఎం వద్ద ఫైల్
- - నేటికీ తేలని ఎస్జీటి పంచాయితీ.
డిఎస్సీ నోటిఫికేషన్పై ప్రభుత్వం ఏడాదిగా కాలయాపన చేస్తోంది. 10,531 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ఊరిస్తోంది. ఇప్పటికే రెండు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లను నిర్వహించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 6న నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చివరకు చెత్తులేత్తేశారు. డిఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ను విద్యాశాఖ, ఆర్థిక శాఖ ఆరు నెలల పాటు బంతాటలా ఆడుకుని చివరికి ముఖ్యమంత్రి వద్దకు మూడు వారాల క్రితం పంపాయి. ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచీ అనుమతి రాలేదు. ఇదిలావుండగా ఎస్జీటి పోస్టులపై కూడా స్పష్టత కరువైంది. ఈ పోస్టులకు బిఇడి అభ్యర్థులు కూడా అర్హులేనని ఎన్సిఇటి ఈనెల 3న మార్గదర్శకాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మార్గదర్శకాలు వచ్చి మూడు వారాలు దాటినా ఈ పంచాయితీని కూడా విద్యాశాఖ ఎటూ తేల్చలేకపోయింది. ఈ మార్గదర్శకాలపై ఎస్జీటి అభ్యర్థులు ఆగ్రహంగా ఉన్నారు. బిఇడి అభ్యర్థులకు టెట్ నిర్వహించి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నేరుగా భర్తీ చేసేవిధంగా ఆలోచిస్తున్నామని గతంలో విద్యాశాఖ ప్రకటించి ఇంతవరకు నిర్ణయం వెల్లడించలేదు. ముఖ్యమంత్రి డిఎస్సీ నోటిఫికేషన్కు ఆమోదం తెలిపినా ఎస్జీటి పోస్టులపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోకపోతే ఎస్జీటి, బిఇడి అభ్యర్థుల మధ్య వివాదం తలెత్తి మొత్తంగా డిఎస్సీ మరింత జాప్యమయ్యే అవకాశముందని పలువురు అంచనా వేస్తున్నారు