నీట్ను వీడని వివాదాలు
- తాజాగా ముంబయి హైకోర్టు స్టే- నిలిచిపోయిన రెండోవిడత కౌన్సెలింగ్
వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రస్స్ టెస్ట్ (నీట్ ) ప్రవేశ పరీక్షను వివాదాలు వీడటం లేదు. కోర్టు కేసులు, స్టే ఆర్డర్లతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. గత ఏడాది ప్రాంతీయ భాషల మాధ్యమంలో పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో హాజరైన విద్యార్థులకు వేర్వేరుగా ప్రశ్నా పత్రాలు వచ్చాయని ఆందోళనలు చెలరేగడంతో ప్రవేశాలపై పలు రాష్ట్ర హైకోర్టులు స్టే ఆర్డర్లు ఇచ్చాయి. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రవేశాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది కూడా తమిళ మాధ్యమంలోని ప్రశ్నా పత్రాల్లో అచ్చు తప్పులపై కేసు సుప్రీం కోర్టు విచారణలో వుంది. తాజాగా ముంబయి హైకోర్టు ఆలిండియా ఇఎస్ఐసి కోటా సీట్ల భర్తీలో అక్రమాలు జరిగియంటూ వైద్య విద్య ప్రవేశాలపై స్టే విధించింది. ఇఎస్ఐసి కోటాతో పాటు అన్ని విభాగాల్లోని కౌన్సెలింగ్ ఆపేయాలని ఎంసిఐని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా రెండో విడత కౌన్సెలింగ్ నిలిచిపోయింది.