20 వేల కొలువులు ఒకేసారి ప్రభుత్వ ప్రకటన!
10,351 టీచర్లు.. కొత్తగా 3 వేల పోలీసు పోస్టులుఆరోగ్యంలో 2 వేలు, 1500 పంచాయతీ సెక్రటరీలు
ఆర్థిక శాఖ తుది ప్రతిపాదనలు..
2నాటి కేబినెట్లో ఓకే
ఒకేసారి ఇరవై వేల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలను ఆమోదించే అవకాశం ఉంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఏపీపీఎస్సీ ద్వారా వీటి నియామకాలు చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీనే 10,351 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందనిఅంతా భావించారు. కానీ, ఆర్థిక శాఖ కొర్రీలు వేయడంతో ఆ నోటిఫికేషన్ అనుకున్న సమయానికి రాలేదు. ఆ టీచర్ పోస్టులతో పాటు మిగిలిన అన్ని శాఖల్లోని ఖాళీలను ఒకేసారి భారీస్థాయిలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలు పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది.
🌻ఇప్పటికే గుర్తించిన 10వేల టీచర్పోస్టులు కాకుండా... వివిధ శాఖల్లో మరో పదివేలకుపైగా పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఇందులో అత్యధికంగా పోలీసు శాఖ నుంచి 4 వేల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆర్థిక శాఖ దాదాపు 3 వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశముంది. ఇందులో అధిక శాతం కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ 1600 పోస్టుల భర్తీకి ప్రతిపాదన పంపింది.
🌻 వీటన్నింటి భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే... ఇదే తరహాకు చెందిన మరో 400 పోస్టులను కలిపి వైద్య ఆరోగ్య శాఖలో 2000 పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ ఇవ్వాలని భావిస్తోంది. ప్రజా సంక్షేమం, వైద్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో ఆ శాఖకు అవసరమైనన్ని పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ తెలిపేందుకు ఆర్థిక శాఖ సిద్ధంగా ఉంది.
🌻 పంచాయతీ రాజ్శాఖ నుంచి 1500 పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు అందాయి. ఆర్థిక శాఖ వీటిని యథాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. నవ్యాంధ్రలో గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి కుటుంబానికి కనీసం పదివేల ఆదాయం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీటన్నింటిని సక్రమంగా నిర్వహించేందుకు తగిన అధికార యంరత్రాంగం ఉండాలనే యోచనతో... పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి సిద్ధమైంది.
🌻అటవీ శాఖకు సంబంధించి దాదాపు 500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశముంది. అలాగే, 1447 మున్సిపల్ టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం లభించినట్లు తెలిసింది. ఇవి కాకుండా, వాణిజ్య పన్నులు, దేవదాయం, విద్యుత్, వ్యవసాయ శాఖల్లో కూడా పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ శాఖల్లో పోస్టుల భర్తీ భారీ సంఖ్యలో ఉండబోదని తెలుస్తోంది. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వాటి భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇప్పటికే ఆసల్యమైందని భావిస్తున్న ప్రభుత్వం వచ్చే కేబినెట్లో ఈ ప్రతిపాదనలు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
🌻ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు నియామకాలపై భారీస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో... ఈసారి అన్నిపోస్టుల భర్తీని ఏపీపీఎస్సీ ద్వారా పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.