Type Here to Get Search Results !

2/7 నేటి విద్యా విషయక ముఖ్య వార్తా విషయాలు

నేడు టెట్‌ ఫలితాలు

🌻విశాఖపట్నం, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత రాత పరీక్ష (టెట్‌) ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారు.
🌻ముందుగా పేర్కొన్న షెడ్యూల్‌ మేరకు అయితే జూన్‌ 30న విడుదల చేయాల్సి ఉంది. అనివార్య సాంకేతిక కారణాలతో రెండు రోజులు ఆలస్యమయ్యింది.

అప్పుల్లో ‘పరీక్షల’ మండళ్లు  DCEB 

*విడుదల కాని ఎస్‌ఏ ప్రశ్నపత్రాల ముద్రణ, సరఫరా నిధులు*
గత రెండు విద్యాసంవత్సరాల్లో దాదాపు రూ.10కోట్ల బకాయిలు*
*♦ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థుల పరీక్ష ఫీజులతో సర్దుబాటు*
*♦పట్టనట్లు వ్యవహరిస్తున్న ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ*
🌻అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లా ఉమ్మడి పరీక్షల మండళ్లు(డీసీఈబీ) అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ‘సంగ్రహణాత్మక మదింపు (సమ్మేటివ్‌ అసెస్ మెంట్‌)’ పరీక్షల ప్రశ్నపత్రాల ముద్రణ, సరఫరాకు సంబంధించిన నిధులు విడుదల కాకపోవడమే ఇందుకు కారణం. సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ (ఆర్‌ఎంఎస్‌ఏ) మధ్య సమన్వయ లోపం డీసీఈబీలకు శాపంగా మారింది.
🌻 2016-17, 2017-18 విద్యా సంవత్సరాల్లో ఎస్‌ఎస్‌ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నుంచి జిల్లా మండళ్లకు దాదాపు రూ.10కోట్ల వరకు రావాల్సి ఉంది. ఈ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్‌ ప్రింటర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని సకాలంలో ఇవ్వలేకపోతున్నారు.
🌻దీంతో ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు ఫీజుల రూపేణా చెల్లించే మొత్తాలతోనే సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఎస్‌ఏ ప్రశ్నపత్రాల ముద్రణ, సరఫరా నిమిత్తం డీసీఈబీలకు ఎస్‌ఎస్‌ఏ ఎస్పీడీ, 9, 10వ తరగతులకు సంబంధించి ఆర్‌ఎంఎస్‌ఏ డైరెక్టర్‌ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, ఎయిడెడ్‌, మున్సిపల్‌, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లన్నింటికీ ప్రశ్నపత్రాల ముద్రణ, సరఫరా నిమిత్తం ఈ నిధులు అందజేయాలి.
🌻 ప్రశ్నపత్రాలను రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి రూపొందించి పంపుతుండగా ప్రైవేట్‌ సంస్థల ద్వారా వాటిని ముద్రించి పాఠశాలలకు సరఫరా చేస్తుంటారు.
🌻2016-17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆర్‌ఎంఎస్‌ఏ రూ.2.14కోట్లు ఇవ్వగా, మరో రూ.4కోట్ల వరకు పెండింగ్‌లో పెట్టారు. 2017-18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు. ఇక ఎస్‌ఎస్‌ఏ రూ.13.79కోట్ల మేర బకాయిలు ఉండగా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ప్రొసీడింగ్స్‌ ఇచ్చి చోద్యం చూస్తున్నారు. ఈ పరిస్థితి డీసీఈబీలకు ఇబ్బందికరంగా మారింది.
🌻 ముద్రణ చార్జీల కోసం ప్రైవేట్‌ ప్రింటర్ల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 6- 10వ తరగతుల వరకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజుల రూపంలో వసూలవుతున్న డబ్బును వారికి చెల్లిస్తున్నారు.

✍విదేశీ వైద్య మిథ్య✍

*♦డాక్టర్‌ కావడం కోసం దండయాత్ర*
*♦విదేశీ వైద్య విద్య కోసం పరుగులు*
*♦తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా 6-7 వేల మంది విదేశాలకు*
*♦ఎగ్జిట్‌ పరీక్ష పాస్‌ కావాల్సిందే*
*♦లేకుంటే గుర్తింపు, ప్రాక్టీసు ఉండవు*
*♦ఈ పరీక్షలో నూటికి 70 శాతం ఫెయిల్‌*
*♦పదేళ్లు కష్టపడినా డాక్టర్‌ కాలేక నిర్వేదం*
🌻జూలై 1 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ కావాలనే లక్ష్యం! మూడు నాలుగేళ్లు కష్టపడుతున్నారు! లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. అయినా, ర్యాంకు రావట్లేదు! దేశంలో మెడికల్‌ సీటు దక్కట్లేదు. ఫలితంగా, 30 నుంచి 50 లక్షలు ఖర్చు చేసి కజకిస్థాన్‌, రష్యా తదితర దేశాలకు వెళుతున్నారు. అక్కడ డిగ్రీ తీసుకుని వచ్చిన తర్వాత మన దేశంలో ‘డాక్టర్లు’ అవుతున్నది నూటికి 30 మందే! మిగిలిన వారు గుర్తింపు లేకుండానే మిగిలిపోతున్నారు. విదేశీ విద్య నాణ్యమైందని భావిస్తూ.. ఐదేళ్లు కష్టపడుతున్నారు. చివరికి మోసపోతున్నారు. అయినా, ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి ఆరేడు వేల మంది ఎంబీబీఎస్‌ కోసం విదేశాలకు వెళ్తూనే ఉన్నారు.
🌻అన్నిటికీ ఓ సీజన్‌ ఉన్నట్లే.. విదేశాల్లో వైద్య విద్యకు కూడా ఓ సీజన్‌ ఉంది. అదే నీట్‌ ర్యాంకులు వెలువడడం. నీట్‌లో మంచి ర్యాంకు రానివాళ్లు.. విదేశాలకు పయనమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చైనా, రష్యా, ఫిలిప్ఫైన్స్‌, ఉక్రెయిన్‌, కజకిస్థాన్‌ తదితర దేశాలకు పెద్దఎత్తున వెళ్తున్నారు. అక్కడ ఐదేళ్లపాటు వైద్య విద్య అభ్యసించడం ఒక ఎత్తైతే.. తిరిగొచ్చాక ఇక్కడ మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌లో పాసవ్వడం మరో ఎత్తు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ పూర్తి చేసినవాళ్లు మన దేశంలో వైద్యుడిగా గుర్తింపు పొందాలంటే ఈ పరీక్షలో పాస్‌ కావడం తప్పనిసరి. అప్పుడే వారిని వైద్యులుగా ఎంసీఐ గుర్తిస్తుంది. డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసుకునేందుకు అనుమతి లభిస్తుంది.
🌻అయితే, తెలుగు రాష్ట్రాల నుంచి ఎగ్జిట్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య నూటికి ముప్పై శాతమే. ఆ 30 మంది కూడా నాలుగేళ్లు కష్టపడితే కానీ పాస్‌ కావడం లేదు. విదేశీ వైద్య కళాశాలల్లో నాణ్యతాప్రమాణాలు లేకపోవడంతో 70 శాతం విద్యార్థులు ఎగ్జిట్‌ పరీక్షలో ఫెయిల్‌ అవుతున్నారు. విదేశాల్లో చదివి వచ్చిన తర్వాత, ఈ పరీక్షలో పాసయ్యేందుకు కొంతమంది ఢిల్లీ వెళ్లి మరీ కోచింగ్‌లు తీసుకుంటున్నారు. ఇలా రెండు మూడేళ్లు కోచింగ్‌లు తీసుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. దాంతో, ఒక్క ఎంబీబీఎస్‌ పూర్తి చేసి, వైద్యుడిగా గుర్తింపు పొందడానికే 8-9 ఏళ్లు పడుతోంది. కొంతమంది అప్పటికి కూడా ఎగ్జిట్‌ టెస్ట్‌ పాస్‌ కాలేక వదిలేస్తున్నారు. ఏటా జూన్‌, డిసెంబరు నెలల్లో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ రెండుసార్లు ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ నిర్వహిస్తుంది. ఈ ఏడాది జూన్‌ 29న జరగనుంది. ‘‘విదేశాల్లో చదివేందుకు ఇప్పటికే రూ.30-50 లక్షలు ఖర్చు పెట్టాం. మళ్లీ కోచింగ్‌కు 3-4 లక్షలు ఖర్చు పెట్టాం. అయినా, పాస్‌ అవుతామనే నమ్మకం లేదు’’ అని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు.


*♦అంత నాణ్యత లేని విదేశీ వైద్య విద్య:నిపుణులు
విదేశీ వైద్య విద్య అంత నాణ్యంగా ఉండడం లేదు. పైగా, మన పిల్లలకు అక్కడి స్థానిక భాష సమస్యగా మారుతోంది. అక్కడ స్థానిక భాషలో చదువు చెబుతారు. కాలేజీలకు పెద్దగా గుర్తింపు ఉండదు. వారికక్కడ సీట్లు నిండకే కన్సల్టెన్సీల ద్వారా విదేశీ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. నాణ్యతా ప్రమాణాలుంటే అక్కడి విద్యార్థులతోనే అవి నిండిపోతాయి కదా! ఇక్కడ నీట్‌లోనే ర్యాంకు సాధించలేని విద్యార్థి ఇక ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ ఎలా పాసవుతాడు!? ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలి. లేకపోతే, ఆర్థికంగా నష్టపోతారు. అటు పిల్లల భవిష్యత్తూ నాశనమవుతుంది.

*♦ఎంబీబీఎస్‌ వదిలేసుకున్నాం*
మా అబ్బాయిని ఫిలిప్పైన్స్‌లో ఎంబీబీఎస్‌ చేయించాం. ఇక్కడ ఎగ్జిట్‌ పరీక్షలో పాస్‌ కాలేకపోతున్నాడు. విదేశాల్లో ఎంబీబీఎస్‌ చేయడం చాలా తేలికని కన్సల్టెన్సీలు చెప్పడంతో వారి మాయలో పడ్డాం. వైద్యుడిగా గుర్తింపు లేకపోవడంతో ఇప్పుడు ఎంబీఏ చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వైద్య విద్యను అభ్యసించేందుకు పిల్లలను విదేశాలకు పంపేటప్పుడు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని పంపాలి. లేకపోతే వారి భవిష్యత్తు పాడవుతుంది.
*- ఓ విద్యార్థి తండ్రి*

✍ఇంటర్‌ కాలేజిల్లో మధ్యాహ్న భోజనంపై అస్పష్టత

*♦పాఠశాల ఏజెన్సీల ద్వారా నిర్వహణ
*♦విద్యాశాఖాధికారులకు అందని ఉత్తర్వులు*
*♦నేటి నుండి అమలు సాధ్యమేనా...*
🌻ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయదలచిన మధ్యాహ్న భోజన పథకంపై స్పష్టత లేదు. జులై 2 నుంచి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెడతామన్నప్పటికీ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు. ఖర్చులు ఎవరు భరించాలి, వంటకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, నిర్వహణ విషయంలో కళాశాలల ప్రిన్సిపల్స్‌కు స్పష్టత కొరవడింది. దీంతో సోమవారం నుంచి పథకం అమలయ్యే దాఖలాలు కనిపించట్లేదు.
🌻అమలుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 22 ప్రభుత్వ, 22 ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజిలున్నాయి. ఆయా కాలేజిల్లో సుమారు 15వేల మందికిపైగా విద్యార్థులు విద్యను అభ్యశిస్తున్నారు. ప్రభుత్వ కాలేజిల్లో పేదలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా విద్యను అభ్యశిస్తున్నారు. అనేక మంది పేద విద్యార్థులు మధ్యాహ్న సమయంలో భోజనం తెచ్చుకోని సందర్భాలుంటున్నాయి. దీంతో చదువుపై వారు పూర్తిగా కేంద్రీకరించలేకపోతున్నారు. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు వల్ల వస్తున్న సత్ఫలితాలను దృష్టిలో ఉంచుకొని కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
🌻కానీ కళాశాలలు తెరిచి నెల రోజులైనా ఇప్పటికీ పథకం అమలుకు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు.

పాఠశాల ఏజెన్సీలకే అప్పగింత ?
కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు కానందున తాత్కాలికంగా నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం సమీపంలోని పాఠశాలల్లో ఈ పథకం నిర్వహిస్తున్న ఏజెన్సీలకే అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ కమిషనర్‌ నుంచి పాఠశాల కమిషనర్‌కు సంబంధిత ప్రతిపాదనలు వెళ్లగా అక్కడి నుండి జిల్లా స్థాయిలో డిఇఒలు, ఉప విద్యాశాఖాధికారులు, ఎంఇఒలకు ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
🌻 కళాశాలల ప్రిన్సిపల్‌ స్థానిక స్కూల్‌ ప్రధానోపాధ్యాయుల్ని కలిసి అక్కడి ఏజెన్సీల ద్వారా భోజనం వండించటానికి ఏర్పాట్లు చేయించాలని ఇంటర్మీడియట్‌ అధికారుల నుండి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. దీంతో పలువురు ప్రిన్సిపల్స్‌ను స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల్ని కలవగా తమకు తమ ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు రాలేదని, అటువంటప్పుడు తాము ఎలా వండిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
🌻పాఠశాల విద్యాశాఖ నుండి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే భోజనం వండించటానికి ఏర్పాట్లు చేస్తామంటున్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ నుండి ఉత్తర్వులు వెలువడితేనే కళాశాలల్లోనూ భోజనం వండి అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఒక్కో విద్యార్థికి రోజుకు ఎంత కేటాయిస్తారు, రోజువారీ మెనూ విషయంలోనూ సరైన స్పష్టత లేదు. స్కూల్‌ విద్యార్థులకు ఇస్తున్న పరిమాణంలోనే, అదే మెనూ అమలు చేసే అవకాశం ఉందని తెలిసింది. అయితే పాఠశాల విద్యార్థులకు, కళాశాల విద్యార్థులకు వయస్సు తేడా ఉండటంతో కళాశాల విద్యార్థులకు అందించే ఆహార పరిమాణం పెంచాలని డిమాండ్‌ ఉంది.

✍‘ఇంటర్‌’పై నియంత్రణ ఏదీ

*♦రెగ్యులర్‌ అధికారులు లేరు*
*♦160 జూనియర్‌ కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు.. 600 కాలేజీల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ కూడా నై!*
*♦విద్యార్థులకు పూర్తిస్థాయిలో పుస్తకాలూ లేవ్‌*
🌻అమరావతి, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ విద్యా వ్యవస్థ నియంత్రణ కోల్పోయింది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల్లో యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతుండగా.. ప్రభుత్వరంగ జూనియర్‌ కాలేజీల్లో పర్యవేక్షణ చేసే నాథుడు లేకుండా పోయారు. బోధన, మౌలిక సదుపాయాలు కనిపించడం లేదు. రాష్ట్రంలోని 13 జిల్లాలకుగాను ఎక్కడా ఆర్‌ఐవో, డీవీఈవోలు కూడా లేరు. రాష్ట్రవ్యాప్తంగా 448 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా.. 160 కాలేజీల్లో ప్రిన్సిపాళ్లు లేరు. రెగ్యులర్‌ లేదా కాంట్రాక్టు ఫ్యాకల్టీ లేకుండా ఉన్న కాలేజీల్లో కనీసం గెస్ట్‌ ఫ్యాకల్టీని కూడా నియమించలేదు.
🌻 ఇలాంటి కాలేజీల్లో దాదాపు 600లకు పైగా లెక్చరర్‌ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం. దాదాపు అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ పరిస్థితి నెలకొంది. రెగ్యులర్‌ కంట్రోలింగ్‌ ఆఫీసర్స్‌ను నియమించకుండా ఇన్‌చార్జిలతోనే మమ అనిపిస్తున్నారు. ఫలితంగా ఇంటర్‌ విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఇన్‌చార్జి ఆఫీసర్లు, ప్రిన్సిపాళ్ల ఆదేశాలు అమలు కావడం లేదు.
🌻ఫలితంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందటం లేదు. ఇంటర్‌ విద్యా వ్యవస్థలోని సమస్యలను ఇంటెలిజెన్స్‌ విభాగం సర్కారు దృష్టికి తెచ్చినా స్పందన లేకుండా పోయిందని అంటున్నారు. రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలు పునఃప్రారంభమై నెల రోజులు గడిచాయి. కానీ, ఇప్పటి వరకు విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందలేదు.
🌻 ఈ ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం లాంగ్వేజెస్‌ పాఠ్యపుస్తకాలు పూర్తిగా మారిపోయాయి. సిలబస్‌ మారిన పాఠ్యపుస్తకాలను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. వేసవి సెలవుల్లోనే కొత్త పాఠ్యపుస్తకాలను సిద్ధం చేయాల్సిన ఇంటర్‌ బోర్డు సకాలంలో ఈ ప్రక్రియను పూర్తిచేయకపోవడంతో లాంగ్వేజెస్‌ పాఠ్యపుస్తకాలు అందని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది తాలూకు పాఠ్యపుస్తకాల ముద్రణకు అవసరమైన పేపర్‌కు పూర్తిగా డబ్బు విడుదల కానందున జాప్యం జరుగుతోందని సమాచారం. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యార్థులకు బోధన ఎలా చేయాలో అర్థం కావడం లేదని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ లెక్చరర్ల కొరతను తీర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు.

*♦ఉత్తరాంధ్రకు జోనల్‌ ఆఫీసు కరువు*
ఇంటర్‌ విద్యకు పాలనాపరమైన కార్యాలయాల సమస్య దీర్ఘకాలంగా ఉన్నా.. పరిష్కరించడం లేదు. ఇంటర్‌ విద్యా వ్యవస్థకు నాలుగు జోన్లు ఏర్పాటు చేసినా.. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలకు ఇప్పటి వరకు జోనల్‌ ఆఫీసు లేదు. మిగిలిన మూడు జోన్లకు ఆయా జిల్లాల పరిధిలో.. అంటే రాజమండ్రి(జోన్‌-2), గుంటూరు(జోన్‌-3), కడప(జోన్‌-4) జోన్‌ ఆఫీసులు ఉన్నాయి. ఉత్తరాంధ్రకు మాత్రం లేదు. ఇక, ఇంటర్‌ విద్యకు కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కార్యాలయమే లేకపోవడం గమనార్హం.

బడి నుంచి అంతర్జాతీయ ఒడికి!

*♦నాగార్జున వర్సిటీలో ప్రత్యేకంగా క్రీడా ఎక్స్‌లెన్స్‌ కేంద్రం*
*♦అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ*
*♦2021 నాటికి అత్యుత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం*
*♦శ్రీకాకుళం జిల్లాలో 6న శ్రీకారం*
🌻రాష్ట్ర ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
🌻పాఠశాల స్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దే ప్రణాళికకు రూపమిచ్చింది. చదువుతోపాటు ఆటలకూ పెద్దపీట వేసేందుకు చర్యలు చేపట్టింది. జాతీయ క్రీడలు, కామన్వెల్త్‌ గేమ్స్‌, ఒలింపిక్స్‌లో పతకాలు సాధించేందుకు అనువుగా ప్రతిభాన్వేషణ ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల్లోంచి క్రీడల్లో ఔత్సాహికులను ఎంపిక చేసి, శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. మొదట పాఠశాల స్థాయిలో ఎంపిక ద్వారా వారందర్నీ మండల స్థాయికి తీసుకొచ్చి, ఆపై రాష్ట్రస్థాయికి ఎంపిక చేసే ప్రక్రియను చేపట్టింది. ఈనెల ఆరున శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం నుంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. 2021 నాటికి ఉత్తమ క్రీడాకారులను తీర్చిదిద్దే ప్రణాళికతో ముందుకెళ్తోంది.

*👉ఇదీ ప్రణాళిక..*
*♦రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న పదేళ్లు పైబడిన విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపిక చేస్తారు. వారందర్నీ మండలస్థాయికి తీసుకొస్తారు. అక్కడ క్రీడాకారుల ఎంపికను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్‌) కమిటీలు నిర్వహిస్తాయి.*
* అన్ని పాఠశాలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో 1.15 లక్షల మంది విద్యార్థులను తీసుకొస్తారు. మండల స్థాయి నుంచి శాప్‌ కమిటీలు 15వేల మందిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తాయి.
🔸వీరిని రాష్ట్రంలో ఎంపిక చేసిన 100 ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తారు. వీటిలో ఇప్పటికే వ్యాయామ ఉపాధ్యాయులున్నా ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌ కోచ్‌లను నియమిస్తారు. విద్యార్థులు రోజువారీ ఇంటి నుంచి వెళ్లివచ్చేందుకు ఇష్టపడితే అవకాశం కల్పిస్తారు. దూరం కారణంగా వసతిగృహాల్లో ఉండేందుకు ఇష్టపడితే సంక్షేమశాఖల వసతిగృహాల్లో వసతి కల్పించి, పాఠశాలకు అనుమతిస్తారు.
🔸క్రీడల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాక వారిపై నివేదికను బెంగళూరులోని క్రీడా విద్యాలయానికి పంపించి, ప్రతిభ ఆధారంగా ఎవరు ఏ క్రీడకు సరిపోతారో నిర్ణయించి ప్రోత్సహిస్తారు. వీరికి ఆహారంతోపాటు, బూట్లు, దుస్తులు ఇతరత్రా సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది.
🔸ఈ పాఠశాలల్లో ప్రతిభ చూపిన వారిలోంచి కొందరిని క్రీడా అకాడమీలకు ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారిలోంచి 75మందిని తుది స్థాయికి ఎంపిక చేస్తారు.

*♦అత్యుత్తమ ప్రమాణాలతో గాండీవ..*

నాగార్జున విశ్వవిద్యాలయంలో క్రీడా ఎక్స్‌లెన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రముఖ క్రికెటర్‌ అనిల్‌కుంబ్లే సంస్థ టెన్‌విక్‌తో ఒప్పందం కుదర్చుకుంది. దాని తరఫున జమైకా నుంచి విదేశీ కోచ్‌లను తీసుకొచ్చి శిక్షణ ఇస్తారు. 2021 నాటికి అత్యుత్తు క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా 'గాండీవ' పేరిట ఈ ప్రాజెక్టును రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి రూ.100కోట్లు కేటాయించింది. ఏడాదికి రూ.20కోట్లు చొప్పున వ్యయం చేయనున్నారు. 2021లో జరగనున్న జాతీయక్రీడలు, 2022లో కామన్వెల్త్‌, ఆసియా క్రీడలు, 2024లో ఒలింపిక్స్‌లో పాల్గొనడంతో పాటు పతకాలు సాధించే లక్ష్యంతో ప్రభుత్వం కృషిచేస్తోంది.
Tags