Type Here to Get Search Results !

విద్యా విషయక వార్తా సమాహారం 3/7/2018

డీఎస్సీ వాయిదా?

*♦ఆర్థికశాఖ క్లియరెన్స్‌ రాని ఫలితం*
*♦కొలిక్కిరాని కన్వర్షన్‌ ప్రతిపాదన*
*♦6వ తేదీన ప్రకటన లేనట్టే!*
*♦అతి త్వరలోనే ప్రకటన: గంటా*
🌻డీఎస్సీ నోటిఫికేషన్‌ మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 6న 10,351 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో ప్రకటించారు. అయితే, ఆయా టీచర్‌ పోస్టులు భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ నుంచి ఇప్పటి వరకు క్లియరెన్స్‌ రాకపోవడంతో నోటిఫికేషన్‌ ఆలస్యం అనివార్యంగా మారింది.
🌻 డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఇవ్వదలచిన ఖాళీ పోస్టుల్లో వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 3,290 టీచర్‌ పోస్టులను కన్వర్షన్‌ చేయాలంటూ పంపిన ప్రతిపాదనలు కూడా ఓ కొలిక్కి రాలేదని సమాచారం. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌, పీఈటీ, ఎస్‌జీటీ పోస్టులు ఉన్నాయి.
🌻పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదించిన స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు కూడా ఆర్థికశాఖ నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది. మున్సిపాలిటీలలో మొత్తం 1,447 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలినా.. అంతర్గత బదిలీల కసరత్తు జరుగుతుండటంతో రోస్టర్‌ మారుతుందని సమాచారం.
🌻 మున్సిపల్‌, ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఖాళీలకూ ఇంతవరకు అనుమతి రాలేదు. ఇదిలావుంటే, డీఎస్సీ నిర్వహణ బాధ్యతల్ని ఏపీపీఎస్సీకి అప్పగిస్తే ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఈ నేపథ్యంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా పడే అవకాశం ఉంది.

✍టెట్‌లో 57.48% ఉత్తీర్ణత✍

*♦టాపర్లలో మహిళలే అత్యధికం*
*♦25శాతం మందికి 90కి పైగా మార్కులు*
*♦త్వరలో డీఎస్సీ ప్రకటన: మంత్రి గంటా*
🌻విశాఖపట్నం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)-2018 ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 3,97,957మంది దరఖాస్తు చేయగా 3,70,573 మంది(93.11%) హాజరయ్యారు.
🌻వీరిలో 2,13,042 మంది(57.48%) ఉత్తీర్ణత సాధించారు. టెట్‌ ప్రారంభించిన తరువాత 2012లో 37%, 2017 డిసెంబర్‌లో 46.85% అర్హత సాధించారు. ఈ పర్యాయం గతంకంటే 10.43శాతం ఎక్కువమంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
🌻మొత్తంగా చూస్తే 25శాతం మందికి 90కు పైగా మార్కులు వచ్చాయి. పేపర్లు, సబ్జెక్టుల వారీగా ఫలితాలను పరిశీలిస్తే టాపర్లలో అత్యధికులు మహిళలే కావడం విశేషం. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ త్వరలోనే డీఎస్సీ ప్రకటన విడుదల చేసి, 10,351 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
🌻 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పకు హైబ్రిడ్‌ యాన్యూటీ పథకం కింద రూ.4,483కోట్లతో టెండర్లు ఆహ్వానించి బిడ్లు ఖరారు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి, ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య ఉమామహేశ్వరరావు, టెట్‌ కన్వీనర్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

యూనిఫారాలు వచ్చాయ్‌✍

*♦పంపిణీ 15 నాటికి పూర్తి*
🌻అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ ఉచితమే కానీ, ఏదీ సకాలంలో అందదు... అనేది ప్రజల అభిప్రాయం! స్కూల్‌ యూనిఫారాల విషయంలోనూ మినహాయింపు లేదు. జూన్‌లో పాఠశాలలు మొదలైతే డిసెంబరుకుగానీ పంపిణీ పూర్తయ్యేది కాదు. అయితే అధికారులు ఈ సారి ముందుగానే మేల్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన దుస్తుల పంపిణీని జూలై 15 నాటికి ఎట్టి పరిస్థితులలోనూ పూర్తి చేస్తామని సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
🌻 యూనిఫారాల కోసం ఆప్కోకు ఈసారి ముందుగానే ఉత్తర్వులివ్వడంతో ఆప్కో మూడు నెలల క్రితమే పనులు మొదలు పెట్టింది. దీనితో పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తయింది.
🌻నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పంపిణీ జరుగుతోంది. కడప, చిత్తూరు జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లాలో మొత్తం 34 మండలాలకు 4 మండలాల్లో పంంపిణి పూర్తయితే.... మరో 20 మండలాల్లో జరుగుతోంది. విశాఖపట్నం జిల్లాలో 8 మండలాల్లో పంపిణీ పూర్తికాగా 35 మండలాల్లో జరుగుతోంది. తూర్పుగోదావరిలో 5 మండలాల్లో పంపిణీ కాగా మరో 30 మండలాల్లో జరుగుతోంది.
🌻కృష్ణాలో ఇప్పటికే 6 మండలాల్లో పంపిణీ పూర్తి కాగా, మరో 20 మండలాల్లో జరుగుతోంది. గుంటూరులో 3 మండలాల్లో పంపిణీ పూర్తికాగా 20 మండలాల్లో జరుగుతోంది. అలాగే ప్రకాశంలో 9 మండలాల్లో పూర్తికాగా మరో 25 మండలాల్లో పంపిణీ జరుగుతోంది. అనంతపురంలో 9 మండలాల్లో పూర్తికాగా 35 మండలాల్లో పంపిణి జరుగుతోంది.
🌻కాగా, స్థానిక దర్జీలతోనే కుట్టించాలని జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు పట్టుపడుతుండడంతో శ్రీకాకుళంలో పంపిణీ ఆలస్యమయ్యే అవకాశముంది.

మధ్యాహ్న భోజనానికి రూ.424 కోట్లు✍📚

రాష్ట్రంలో 2018-19 సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు ప్రణాళిక ఖరారైంది. దీనికి రూ.424 కోట్లు అవసరమవుతాయని కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది. అందులో రూ.267.35 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఇస్తుంది. మిగతా రూ.156.65 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇటీవల జరిగిన మధ్యాహ్న భోజన పథకం ప్రోగ్రామ్‌ అప్రూవల్‌ బోర్డు(పీఏబీ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
🌻ఈ ప్రణాళికకు కేంద్ర మానవ వనరుల శాఖ ఆమోదం తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పథకానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
🌻కాగా, మధ్యాహ్న భోజన పథకం కోసం భారత ఆహార సంస్థ(ఎఫ్ సీఐ) సరఫరా చేసే ఆహార ధాన్యాలు నాణ్యతగా ఉండడం లేదని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఫిర్యాదు చేశారు. సరైన సగటు నాణ్యత కూడా లేదని తమ తనిఖీల్లో తేలిందని చెప్పారు.
🌻 దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ ఈ విషయాన్ని ఎఫ్‌సీఐ అధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఏడాదికి ఇచ్చే ఎల్పీజీ సిలిండర్ల సంఖ్యను కూడా పెంచాలని రాష్ట్ర అధికారులు కోరారు.

డీఎస్సీపై నాన్చుడు ధోరణి✍

*♦- భర్తీ ఎపిపిఎస్సీనా : విద్యాశాఖ ?*
*♦- మంత్రి వద్ద స్పష్టత కరువు*
*♦- 6న నోటిఫికేషన్‌ అనుమానమే!*
🌻ఉపాధ్యాయ పోస్టులపై భర్తీపై ప్రభుత్వం నాన్చుడు ధోరణితో ఉండడంతో ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామం టూ ఏడాదిన్నర నుంచి నిరుద్యోగులను ఊరిస్తూనే ఉన్నారు. చివరకు జులై 6న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సీ సిలబస్‌ కూడా పాఠ శాల విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో 10,351 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి జులై 6న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఏప్రిల్‌ 28న మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
🌻రెండు సార్టు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను నిర్వహిచడంతో అభ్యర్థులు అంతా డిఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే టీచర్‌ పోస్టుల భర్తీ విధానంపై ప్రభుత్వం వద్ద స్పష్టత లేకుండా పోయింది. మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్సీ)కు అప్పగిస్తామని ప్రభుత్వం చెబుతూ ఉంది.
🌻 యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పోస్టులకు ఎపిపిఎస్‌సి పరీక్ష నిర్వహించి రెండు నెలలకు పైగా గడుస్తోంది. ఇప్పటి వరకు ఈ ఫలితాలు విడుదల కాలేదు. దీంతో సొంతగానే పోస్టులు భర్తీ చేసుకుంటామని ఇటీవల విశాఖపట్నంలో మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మరలా ఎపిపిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని విశాఖపట్నం టెట్‌ ఫలితాల విడుదల సందర్భంగా సోమవారం ప్రకటించారు.
🌻 అయితే పోస్టుల భర్తీపై జులై 2 వరకు ఎపిపిఎస్‌సితో విద్యాశాఖ చర్చలు జరపలేదు. భర్తీపై స్పష్టత లేకపోవడంతో జులై 6న నోటిఫికేషన్‌ విడుదల అవుతుందో లేదోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో టీచర్‌ పోస్టులు భర్తీ ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఆ రాష్ట్రంలోని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
🌻రాష్ట్రంలో కూడా ఎపిపిఎస్‌స్‌కి అప్పగిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయా? లేదో అనే సందేహాలు కూడా నెలకొని ఉన్నాయి. మరో పక్క సిబ్బంది కొరతతో అల్లాడుతున్న ఎపిపిఎస్‌సికి పోస్టుల భర్తీ అప్పగిస్తే సక్రమంగా నిర్వహిస్తుందో? లేదో అనే అనుమానం అభ్యర్థుల్లో నెలకొంది.

✍టెట్‌లో 57.48 శాతం మంది అర్హత✍

*♦- నేడు డైట్‌ సెట్‌ ఫలితాలు విడుదల*
*♦- మంత్రి గంటా శ్రీనివాసరావు*
🌻ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఎపి టెట్‌-2018)ల్లో 57.48 శాతం మంది అర్హత సాధించారు. విశాఖలోని ఎయు వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం టెట్‌ ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఆయన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ 10 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన టెట్‌-2018 పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 3,97,957 మంది దరఖాస్తు చేసుకోగా 3,70,573 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.🌻 వీరిలో 2,13,042 మంది 57.48 శాతం మంది అర్హత సాధించారన్నారు. 150 మార్కుల పరీక్షలో ఒసి అభ్యర్థులు 60 శాతం, బిసి అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ,ఎస్టీ, పిహెచ్‌సి, ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ కేటగిరీవారు 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.
🌻 రాష్ట్రంలో త్వరలో డిఎస్సీ ద్వారా 10,351 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించి ఫలితాలను కేవలం పది రోజుల్లోనే విడుదల చేశామన్నారు. అందుకు ఉద్యోగులు చేసిన కృషిని ఆయన అభినందించారు. మంగళవారం డైట్‌ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే డైట్‌ సెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నట్లు చెప్పారు.
🌻 ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిషనర్‌ సంధ్యారాణి, ఎయు విసి ఆచార్య జి.నాగేశ్వరరావు, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

✍అర్హత మార్కులపై ఆరాటం 

🌻సాక్షి, అమరావతి:* రాష్ట్రంలో ఎంసెట్‌తోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించిన అర్హత(క్వాలిఫైడ్‌) మార్కుల విషయంలో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో అర్హత మార్కులు పొందుతున్న వారికంటే సీట్ల సంఖ్య అధికంగా ఉండడంతో అవి భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. ప్రతిఏటా వేలాది సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. క్వాలిఫైడ్‌ మార్కులను తగ్గిస్తే ఎక్కువ మంది అర్హత సాధిస్తారని, తద్వారా సీట్లు భర్తీ చేసుకోవచ్చని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వంపై వివిధ మార్గాల్లో ఒత్తిడి పెంచుతున్నాయి.

*♦ఇంజనీరింగ్‌లో 2 మార్కులు తగ్గిస్తే..*
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీలు 406 ఉన్నాయి. ప్రస్తుత విద్యా సంవత్స రానికి వీటిలో 1,66,373 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ అనుమతి ఇచ్చింది. ఇంజనీరింగ్‌లో 1.38 లక్షల మంది, బైపీసీ స్ట్రీమ్‌లో 63,000 మంది అర్హత సాధించారు. ఇటీవల నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్‌ ఎంపీసీ స్ట్రీమ్‌లో 89,592 కన్వీనర్‌ కోటా సీట్లకుగాను ఇంకా 47,000 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఆదివారం నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌ చేపట్టినా పెద్దగా స్పందన లేదు. బైపీసీ స్ట్రీమ్‌లోనూ భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎంసెట్‌లో అర్హత మార్కులను తగ్గించాలని ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఎంసెట్‌లో అర్హత పొందాలంటే 160 మార్కులకుగాను 25 శాతం అంటే 40 మార్కులు సాధించాల్సి ఉంటుంది. అందులో 2 మార్కులు తగ్గించాలని యాజమాన్యాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దానివల్ల కొత్తగా మరో 20,000 మంది అర్హత సాధిస్తారని, కొన్ని సీట్లు భర్తీ అవుతాయని పేర్కొంటున్నాయి. క్వాలిఫైడ్‌ మార్కుల తగ్గింపునకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనా«థ్‌ దాస్‌ ససేమిరా అంటున్నట్లు సమాచారం. క్వాలిఫైడ్‌ మార్కుల తగ్గింపు వల్ల ఎక్కువ మంది ఇంజనీరింగ్‌లో చేరుతారని, ఫలితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో ఖజానాపై అధిక భారం పడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

*♦పాలిసెట్‌లో 39,444 సీట్లు ఖాళీ*
రాష్ట్రంలోని 291 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మొత్తం 74,312 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయ్యింది. అయినా ఇంకా 39,444 సీట్లు మిగిలిపోయాయి. ఈ నెల 5, 6 తేదీల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. అయినా సీట్లన్నీ భర్తీ అయ్యే అవకాశం లేదని సమాచారం. పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్ష ‘పాలిసెట్‌’లో కూడా అర్హత మార్కులను తగ్గించాలని యాజమాన్యాలు కోరుతున్నాయి. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ పాండాదాస్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పాలిసెట్‌లో 120 మార్కులకుగాను 30 శాతం అంటే 36 మార్కులు సాధిస్తే అర్హులవుతారు. దీన్ని 25 శాతానికి అంటే 30 మార్కులకు కుదించాలని ప్రతిపాదనలు పంపగా.. అనుమతిస్తూ విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి సంతకం చేశారు. అయితే, సంబంధిత ఫైల్‌ ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వద్ద పెండింగ్‌లో ఉంది.

*♦ఎటూ తేలని డీఎడ్‌ ప్రవేశాలు*
డీఎడ్‌ కోర్సులో ప్రవేశానికి సంబంధించిన డీఈఈసెట్‌లో అర్హత మార్కుల తగ్గింపు వ్యవహారాన్ని ప్రభుత్వం కొన్ని నెలలుగా నాన్చుతోంది. దాదాపు 65,000 సీట్లు అందుబాటులో ఉండగా అర్హులైన అభ్యర్థులు కేవలం 12,000 మంది ఉన్నారు. భారీగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ఇంకా చేపట్టలేదు. డీఈఈసెట్‌లో అర్హత సాధించాలంటే ఓసీలు 50 శాతం, బీసీలు 40 శాతం, ఎస్సీ, ఎస్టీలు 35 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. అయితే ఓసీలు, బీసీలకు అర్హత మార్కులను 35 శాతానికి కుదించాలని, ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు పెట్టరాదని కాలేజీల యాజమాన్యాలు బేరసారాలు సాగిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో డీఎడ్‌ ప్రవేశాలు నిలిచిపోయాయి. 

ఆర్టీఐ పోస్టుల భర్తీలో ఆలస్యమెందుకు?

*♦కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ఫైర్‌.. నోటీసులు జారీ*
🌻న్యూఢిల్లీ, జూలై 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర సమాచార కమిషన్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులు.. 23,500. 2016లో నమోదైన విజ్ఞప్తులు, ఫిర్యాదులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రాల విషయానికి వస్తే.. పశ్చిమబెంగాల్‌లో 40వేలు, కర్ణాటకలో 33వేలు, కేరళలో 14వేల విజ్ఞప్తులు-ఫిర్యాదులు.. ఇలా పలు రాష్ట్రాల్లో చాలా దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
🌻 దీనికంతటికీ సమాచార కమిషనర్లను నియమించకపోవడమేనని ఓ ఆర్టీఐ కార్యకర్త సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసును విచారించిన కోర్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీఐ పోస్టుల భర్తీలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారని నిలదీసి నోటీసులు జారీ చేసింది. కేంద్రంతో సహా నోటీసులు అందుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కేరళ, కర్ణాటక, ఒడిసా, తెలంగాణ ఉన్నాయి.

రేపటి నుంచి ట్రిపు ఐటీ ప్రవేశాలకు మంత్రణం✍📚

♦4, 5 తేదీల్లో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ అభ్యర్థులకు*
*♦6, 7 తేదీల్లో ఒంగోలు ప్రాంగణం విద్యార్థులకు కౌన్సెలింగ్‌*
🌻ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు ఈనెల 4, 5వ తేదీల్లో ఇడుపులపాయలో మంత్రణం ఉంటుందని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ అమరేంద్రకుమార్‌ తెలిపారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థులకు ఈనెల 6, 7వ తేదీల్లో ఇక్కడి కేంద్ర గ్రంథాలయంలో మంత్రణం ఉంటుందన్నారు. ఈ మంత్రంణంకు హాజరయ్యే విద్యార్థులు పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్‌, మార్కుల జాబితా, 4 నుంచి పదో తరగతి వరకు స్టడీ ధ్రువపత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, మీసేవ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందన్నారు.
🌻రేషన్‌కార్డు, విద్యార్థి ఆధార్‌కార్డు, తల్లిదండ్రులకు సంబంధించిన రెండేసి పాస్‌పోర్టు పరిమాణంలోని ఫొటోలు, విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే వేతన ధ్రువీకరణ పత్రం సమర్పించాలని చెప్పారు. ప్రవేశాలకు ఎంపికైన ప్రతి విద్యార్థి కాషన్‌ డిఫాజిట్‌ కింద నిర్ణీత మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

కొలువులపై కోటి ఆశలు

*♦ఏపీపీఎస్సీ ద్వారా 1511 పోస్టులు భర్తీ*
*♦కాంట్రాక్టు విధానానికి స్వస్తి*
*♦త్వరలోనే సవరణ ఉత్తర్వులు*
*♦ఒత్తిళ్లు, పైరవీలకు పూర్తిగా చెక్‌*
*♦ఇకపై రెగ్యులర్‌గానే పంచాయతీ కార్యదర్శులు*
🌻 పంచాయతీ కార్యదర్శుల నియామకంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో కాకుండా... రెగ్యులర్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1511 పంచాయతీ కార్యదర్శుల నియామకాలను ఏపీపీఎస్సీయే చేపడుతుంది.
🌻పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి మంత్రి లోకేశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. నిజానికి 1511 పంచాయతీ కార్యదర్శులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలని ఈ ఏడాది మే 2న ఉత్తర్వులు విడుదల చేసింది.
🌻డిగ్రీ పూర్తి చేసిన స్థానికులను మెరిట్‌ ప్రాతిపదికన జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ ద్వారా నియమించాలని స్పష్టం చేశారు. అయితే... ఈ నియామకాలపై ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిళ్లు భారీగా పెరిగాయి. ప్రక్రియ ప్రారంభం కాకముందే మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్థానిక నేతల పైరవీల తాకిడి పెరిగింది. ఈ సెగ జిల్లా కలెక్టర్లను కూడా తాకింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ప్రాతిపదికన కాకుండా... ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా ఈ నియామకాలు జరపాలని పంచాయతీరాజ్‌ శాఖ నిర్ణయించుకుంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, త్వరలోనే సవరణ ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నారు.

*♦పని భారానికి పరిష్కారం*
పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేశ్‌ క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి అక్కడ నుంచే వాటి పరిష్కారానికి శ్రీకారంచుట్టారు. తగినంత మంది పంచాయతీ సెక్రటరీలు లేరు. సుమారు 16 శాఖలకు సంబంధించిన పనులను పంచాయతీ కార్యదర్శులే పర్యవేక్షించాల్సి వస్తోంది. దీంతో ఒక్కో సెక్రటరీ రెండు, మూడు గ్రామాల బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికే ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్‌ 1054 పోస్టులను భర్తీ చేసింది. ఇక ఆర్థిక భారం దృష్ట్యా 1511 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
*♦జిల్లాల వారీగా ఖాళీలివి...:* శ్రీకాకుళం జిల్లా 83, విజయనగరం 61, విశాఖపట్నం 94, తూర్పుగోదావరి 205, పశ్చిమ గోదావరి 113, కృష్ణా 196, గుంటూరు 122, ప్రకాశం 22, నెల్లూరు 104, అనంతపురం 130, కర్నూలు 111, కడప 104, చిత్తూరు జిలా 166.

*♦వెయిటేజీ మార్కులు ఇవ్వాలి* కార్యదర్శుల నియామకంలో తమ కు వెయిటేజీ మార్కులివ్వాలని పంచాయతీల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పార్ట్‌టైం విధానంలో జీఓ నెం.112, 212 కింద పలు పంచాయతీల్లో గుమాస్తాలుగా పనిచేస్తున్న తమకు ఏళ్ల తరబడి అరకొర వేతనాలు అందుతున్నాయని పేర్కొంటున్నారు. సుమారు 450 మంది పార్ట్‌టైం ఉద్యోగులు పంచాయతీల సాధారణ నిధుల నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. అర్హత కలిగిన తమకు నియామకాల్లో వెయిటేజీ మార్కులు కలపాలని కోరుతున్నారు.
Tags