Type Here to Get Search Results !

రిజర్వేషన్‌ 50% దాటుతోందో లేదో పునః పరిశీలించండి High Court

మెడికల్‌ సీట్ల భర్తీలో ప్రతిభావంతులకు అన్యాయం జరగకూడదు. రిజర్వేషన్‌ అభ్యర్థులు నష్టపోకూడదు. ఉభయ తారకంగా ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించవచ్చన్న వాదోపవాదాలు జరిగినప్పుడు రెండు సూచనలు వచ్చాయి. వాటిలో ఒకటి.. మొత్తం రిజర్వేషన్‌ 50 శాతం దాటుతోందా లేదా అని చూడడం. రెండోది, స్లైడింగ్‌ లేకుండా ప్రముఖ కాలేజీల్లో మెరిట్‌తోనే సీట్లను భర్తీ చేయడం. అప్పుడు ప్రతిభావంతులకు న్యాయం జరుగుతుంది. రిజర్వుడు అభ్యర్థులు ఇబ్బందులు పడరు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు రిజర్వేషన్‌ ప్రోగ్రామ్‌ను పునః పరిశీలించి, వివరాలను కోర్టుకు సమర్పించాలని ఎన్టీఆర్‌, కాళోజీ హెల్త్‌ వర్సిటీల తరపు న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి. రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
రిజర్వుడ్‌ అభ్యర్థులు ప్రతిభ ఆధారంగా ఓపెన్‌ కోటాలో సీట్లు పొందితే.. తర్వాత వాటిని వదులుకుని రిజర్వుడ్‌ కేటగిరీలో మరో కాలేజీలో చేరితే.. సదరు ఓపెన్‌ కోటా సీటును తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థితో భర్తీ చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2001లో జీవో 550 జారీ చేశారు. దాని ప్రకారం.. రిజర్వుడ్‌ కేటగిరీకి చెందిన ఓ విద్యార్థికి మంచి ర్యాంకు వచ్చిందనుకుందాం. అతనికి ఓపెన్‌ కోటాలోనూ, రిజర్వుడ్‌ కోటాలోనూ సీటు వస్తుంది. సదరు విద్యార్థి తొలుత ఓపెన్‌ కోటాలో సీటు తీసుకున్నాడని అనుకుందాం. ఆ తర్వాత అతనికి నచ్చిన మరో కాలేజీలో రిజర్వేషన్‌ కేటగిరీలో సీటు వచ్చిందని అనుకుందాం. అతను ఓపెన్‌ కోటాను వదులుకుని రిజర్వేషన్‌ కోటాలో వచ్చిన సీటులో చేరాడని అనుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లో ఓపెన్‌ కోటా సీటును మెరిట్‌ ఆధారంగా ఇవ్వరాదని, దానిని మళ్లీ రిజర్వుడు అభ్యర్థితోనే భర్తీ చేయాలని జీవో 550 స్పష్టం చేస్తోంది. ఏటా ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీ జరుగుతోంది. కానీ, దీనివల్ల తమకు అన్యాయం జరుగుతోందని ఓపెన్‌ కేటగిరీ విద్యార్థులు గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. దానితో జీవో 550 అమలుపై కోర్టు స్టే ఇచ్చింది. ఫలితంగా, మెడికల్‌ కౌన్సెలింగ్‌లో ఈ ఏడాది జీవో 550ని అమలు చేయలేదు.

దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 250 మంది అభ్యర్థులు ఎంబీబీఎస్‌ సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ జీవోను అమలు చేయాలని కొందరు, వద్దని మరికొందరు వేర్వేరు వ్యాజ్యాల్లో హైకోర్టును కోరారు. ఈ పిటిషన్లు గురువారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా ఈ సమస్యను ఉభయ తారకంగా ఏవిధంగా పరిష్కరించవచ్చనే విషయమై వాదోపవాదాలు జరిగాయి.

ఈ సందర్భంగా, ప్రోగ్రామ్‌ (ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారనే అంశం)ను పునః పరిశీలించడానికి యూనివర్సిటీలను అనుమతించాలని, తద్వారా రిజర్వేషన్‌ బెంచ్‌ మార్క్‌ 50 శాతం దాటిందో లేదో చూడడానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయనేది మొదటి సూచన. ప్రముఖ కాలేజీల్లో సీట్లను స్లైడింగ్‌ లేకుండా ప్రతిభావంతులతోనే భర్తీ చేయాలనేది రెండో సూచన. దాంతో, ఓపెన్‌ కోటా సీటును తిరిగి రిజర్వుడ్‌ అభ్యర్థితో భర్తీ చేస్తే రిజర్వేషన్‌ 50 శాతం బెంచ్‌ మార్క్‌ను దాటుతోందో లేదో పునః పరిశీలించి, శుక్రవారం నివేదిక అందించాలని వర్సిటీ స్టాండింగ్‌ కౌన్సిల్‌ను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Tags