అంతర్జిల్లా బదిలీలకు వారంలోగా ఉత్తర్వులు
ఉపాధ్యాయుల అంతర్జిల్లా బదిలీలపై వారంలోగా ఉత్తర్వులు జారీచేస్తామని విద్యాశాఖ అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై విద్యాశాఖ స్పెషల్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పాఠశాల విద్యా కమిషనర్ కె.సంధ్యారాణి సోమవారం సచివాలయంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, పండిట్, పీఈటీల అప్గ్రెడేషన్ సమస్యలు పరిష్కారం అయ్యేలా పదిరోజుల్లో ఉత్తర్వులు విడుదల చేస్తామని వారికి హామీ ఇచ్చారు. సర్వీస్ రూల్స్కు సంబంధించి ట్రైబ్యునల్ అనుమతి ఇచ్చిన వెంటనే పదోన్నతులకు అనుమతిస్తామన్నారు. ఈ చర్చల్లో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) చైర్మన్ పి.బాబురెడ్డి, సెక్రెటరీ జనరల్ జి.హృదయరాజు, కోచైర్మన్లు జి.నాగేశ్వరరావు, పి.పాండురంగవరప్రసాద్, పి.కృష్ణయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం నారాయణరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరాజు పాల్గొన్నారు.