- 3న విజయవాడలో ఇంటర్వ్యూలు కాపు కార్పొరేషన్ ఎండీ శివశంకర్రావు
రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల యువతీ, యువకులకు జీఆర్ఈ, జీఎంఏటీ, గేట్, సీఏ, ఐపీసీసీ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు కార్పొరేషన్ ఎండీ శివశంకర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాపు కార్పొరేషన్, శ్రీలక్ష్మీసాయి మేధా, పీర్స్ టెక్నాలజీ, టి.ఎల్.సొల్యూషన్స్, మరో రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. పుస్తకాలు, ఇతర ఖర్చుల నిమిత్తం వన్టైమ్ స్టైపెండ్ కింద రూ.8 వేలు ఇస్తామని వివరించారు.
డిగ్రీ చదువుతున్న విద్యార్థులు అర్హులని, వయసు 18-35 ఉండాలని తెలిపారు. సీఏ కోర్సులకు మాత్రం ఇంటర్ పూర్తి చేసి, వయసు 17 సంవత్సరాలున్న వారందరూ అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఆగస్టు 3వ తేదీ ఉదయం పది గంటలకు విజయవాడలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. విద్యార్హత సర్టిఫికెట్స్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, రేషన్కార్డు, ఆధార్కార్డు తీసుకురావాలని సూచించారు. ఇతర వివరాల కోసం 7331172074, 75, 76 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు