Type Here to Get Search Results !

Telugu Educational News 15th Oct 2022

సబ్జక్టు పోస్టులకు కోత!

లాంగ్వేజీకి బదలాయింపు
ఆంగ్ల మాధ్యమం ముసుగులో విద్యా శాఖ చర్యలు
ప్రాథమిక పాఠశాలల విలీనంతో మిగిలిన 126 పోస్టులు
ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెంట్లుగా బదలాయింపు
డీఎస్సీలో ఆ మేరకు కోత
భవిష్యత్తులో ప్రైమరీ స్కూళ్ల హెచ్‌ఎంలకూ మంగళం

ఆంగ్ల మాధ్యమ బోధన మోజులో పడిన ప్రభుత్వం చిన్నారులకు ప్రాథమిక విద్యను దూరంచేస్తోంది. ఇందులో భాగంగా తీసుకుంటున్న పలు నిర్ణయాలు భవిష్యత్తులో విద్యా వ్యవస్థను మరింత బలహీనం చేయనున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. సబ్జక్టు పోస్టులను లాంగ్వేజీ పోస్టులకు బదలాయిస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.

ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ బోధన తప్పనిసరి చేసిన ప్రభుత్వం మిగిలిన సబ్జక్టు పోస్టులకు కోతపెట్టింది. సాధారణంగా ఒక సబ్జక్టుకు అదనపు పోస్టులు అవసరమైతే ఆర్థిక శాఖ అనుమతితో మంజూరుచేయాలి. అయితే దీనికి విరుద్ధంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకుని పోస్టుల హేతుబద్ధీకరణ ద్వారా ఉమ్మడి జిల్లాలో 100 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను మిగులుగా చూపించారు. దీనికితోడు ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటరు దూరంలో వున్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో 126 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా గుర్తించారు. వెరసి 226 పోస్టులను లాంగ్వేజి టీచర్లుగా బదలాయిస్తూ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

విలీనంతో పోయిన పోస్టులు
నూతన విద్యావిధానం అమలులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను కిలోమీటరు దూరంలో వున్న ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో ఆంగ్లం, తెలుగు బోధించే టీచర్లు అవసరమయ్యారు. అయితే తరగతుల విలీనంతో ప్రస్తుత విద్యా సంవత్సరానికి 126 ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఎత్తివేసిన విద్యా శాఖ...వాటిని ఉన్నత పాఠశాలల్లో అవసరం పడిన ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లుగా బదలాయించింది. ఉమ్మడి జిల్లాలో 126 ఆంగ్లం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు అవసరమని అధికారులు గుర్తించారు. రేషన్‌లైజేషన్‌లో భాగంగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో అక్కడ పనిచేస్తున్న 110 ఇతర సబ్జక్టుల పోస్టులను కూడా లాంగ్వేజి స్కూల్‌ అసిస్టెంట్లుగా బదలాయిం చారు. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ చేసిన ప్రతిపాదనను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ అనుమతించారు.

ఆంగ్లం, తెలుగు, హిందీ బోధనకు సబ్జక్టు టీచర్లు
రేషనలైజేషన్‌, తరగతుల విలీనంతో మిగిలిపోయిన టీచర్లలో అర్హులను గుర్తించి ఆంగ్లం, తెలుగు, హిందీ స్కూల్‌ అసిస్టెంట్లుగా బదలాయించారు. ఈ విధంగా 67 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం, 44 సోషల్‌ స్టడీస్‌, 22 బయాలజీ, మూడు ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను ఆంగ్లం స్కూల్‌ అసిస్టెంట్లగా కన్వర్షన్‌ చేశారు. ఇంకా 20 గణితం, ఒక ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, తొమ్మిది ఫిజికల్‌ సైన్స్‌ స్కూలు అసిస్టెంట్ల పోస్టులను తెలుగు స్కూల్‌ అసిస్టెంట్లుగా 45 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, రెండు ఫిజికల్‌ సైన్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులను హిందీ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లోకి, 13 ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల్లోకి కన్వర్ట్‌ చేశారు. పలు రకాలుగా మిగులులో వున్న టీచర్లకు ఇతర సబ్జక్టులు బోధన కు బదలాయించడానికి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. బీఈడీలో గణితంతోపాటు ఆంగ్లం, తెలుగు మెథడాలజీ తీసుకున్నవారు, పీజీలో ఆంగ్లం, తెలుగు స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసిన స్కూల్‌ అసిస్టెంట్లు ఆయా సబ్జక్టులు బోధనకు అర్హులని అధికారులు చెబుతున్నారు. అయితే ఏళ్ల తరబడి గణితం, సోషల్‌ బోధించే టీచర్లు ఒక్కసారిగా తెలుగు బోధించడం ఇబ్బందిగా వుంటుందని కొందరు టీచర్లు అంగీకరిస్తున్నారు. తరగతుల విలీనంతో భవిష్యత్తులో ప్రాఽథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయ పోస్టులు రద్దయినట్టేనని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పాఠశాలల విలీనంతో 350 ఎస్జీటీ పోస్టులు, కర్నూలు జిల్లాకు అదనంగా కేటాయించిన పోస్టుల కోసం బదలాయించడం వల్ల మరో 156 ఎస్జీటీ పోస్టులు రద్దయ్యాయని గుర్తుచేస్తున్నారు. రేషనలైజేషన్‌, ఇతరత్రా మిగులు చూపించి 226 పోస్టులను స్కూల్‌ అసిస్టెంట్‌లుగా బదలాయించడం వల్ల భవిష్యత్తులో చేపట్టబోయే డీఎస్సీలో ఆ మేరకు పోస్టుల్లో కోత పడుతుందని ఆరోపిస్తున్నారు. నూతన విద్యా విధానం అమలు పేరిట ప్రాథమిక, సెకండరీ విద్యలో ఉపాధ్యాయ పోస్టుల కోత లేదా రద్దు ద్వారా ప్రైవేటు విద్యకు ప్రభుత్వం తలుపులు తెరుస్తోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.

ఉదయం 10 గంటలకల్లా సీటులో ఉండాల్సిందే

కొందరు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదు
ఇక పై రోజువారీ హాజరు వివరాలు పంపండి
సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు
 రాష్ట్ర సచివాలయంలోని ప్రతి విభాగం అధికారులు, ఉద్యోగుల హాజరు వివ రాల్ని రోజూ తమకు పంపాలని సాధారణ పరిపాల నశాఖ ఉత్తర్వులు జారీచేసింది. పదే పదే చెప్పినా కొందరు అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించట్లేదని, విధులకు ఆలస్యంగా హాజరవుతు న్నారని, అది రోజువారీ కార్యకలాపాల నిర్వహణకు ఇబ్బందిగా మారుతోందని ఓ సర్క్యులర్ లో సాధా రణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) రేవు ముత్యాలరాజు పేర్కొన్నారు. సచివాలయ నిబంధనల ప్రకారం అధికారులు, ఉద్యోగులు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు విధుల్లో ఉండాలని స్పష్టంచేశారు. ఈ మేరకు సచి వాలయ ఆఫీసు మాన్యువల్ నిబంధనల్ని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నెల 17 నుంచి రోజూ హాజరు వివరాలను మధ్యాహ్నం 3 గంటల్లోగా సాధారణ పరిపాలనశాఖ మెయిల్ ఐడీకి పంపించా లని స్పష్టంచేశారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు.

పీఎం శ్రీ' పాఠశాలలు..మండలానికి రెండు 

ఎన్ఈపీ-2020 లక్ష్యాలకు అనువుగా తీర్చిదిద్దనున్న కేంద్రం
సకల సౌకర్యాలతో దేశవ్యాప్తంగా14,500 బడులు
నూతన జాతీయ విద్యా విధానం -2020 లక్ష్యా లకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను సకల సౌకర్యా లతో తీర్చిదిద్దాలని నిర్ణయించిన కేంద్రం మండలానికి రెండు పాఠశాల లను ఎంపిక చేయనుంది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తారు. అందుకు ఒక్కో బడికి రూ. కోటిన్నర నుంచి రూ.2 కోట్లు వెచ్చిస్తారు. పథకం, విధి విధానాలను వివరించేందుకు అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో కేంద్ర అధికారులు శుక్రవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించారు. ఏటా కొన్ని చొప్పున ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై 2026-27 నాటికి దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను అభివృద్ధి చేస్తారు. అందుకు రూ.27,360 కోట్లు వ్యయం చేయాలని కేంద్రం నిర్ణయించగా అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు 60:40 శాతం వాటాలు భరిస్తాయి. ఈ పథకం వల్ల 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా వేశారు. ఒక్కో పాఠశాలలో సగటున 125 మంది విద్యార్థులు ఉంటారు..

ఏమిటీ పీఎం శ్రీ ?
తన జాతీయ విద్యా విధానం -2020లో పలు లక్ష్యాలను కేంద్రం నిర్దే శించింది. తరగతికి తగిన విద్యాసామర్ధ్యాలు ఉండాలని, ఒత్తిడి లేని విద్య అందించాలని, విద్యేతర కార్యక్రమాలకూ పెద్దపీట వేయాలని, గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, క్రీడా మైదానం వంటి సౌకర్యాలతోపాటు పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలని, విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం. దాన్ని చేరుకునేందుకు అనువుగా పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ) పేరిట గత నెలలో కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఎంపిక ఎలా... ఎన్ని వస్తాయి?
ఛాలెంజ్ విధానంలో మండలానికి గరిష్ఠంగా రెండు పాఠశాలలను ఎంపిక చేస్తారు. అందులో ఒకటి ప్రాథమిక, మరొకటి ఉన్నత పాఠశాలలు ఉంటాయి. ప్రాథమికంగా ఎంపికైన పాఠశాలల జాబితాను యూడైస్ ఆధా రంగా కేంద్ర రాష్ట్రానికి పంపిస్తుంది. ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయులలో పరిశీలించి తుది ఎంపిక చేస్తారు. అంటే ఎక్కువ మంది విద్యార్థులున్న, ఎక్కువ విస్తీర్ణం, ఉత్తమ విధానాలు అవలంబించే, వినూత్నంగా బోధన చేసే పాఠశాలలు ఎంపికయ్యే అవకాశం ఉంది.

నేడు చేతుల పరిశుభ్రత దినోత్సవం

ప్రపంచ చేతుల శుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని పాఠశా లల్లో శనివారం ఈ కార్యక్రమాలు నిర్వహించాలని సమగ్రశిక్ష ఏపీసీ డా.ఏ. శేఖర్ అన్నారు. పలువురు అధికారులు పాల్గొని తనిఖీలు నిర్వహిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్ కు దిక్సూచిగా యూడైఎస్ ప్లస్

పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్
విజయవాడ వేదికగా యూడైస్ ప్లస్ 47వ ప్రాంతీయ వర్కుషాప్
యూడైఎస్-ప్లస్ (విద్యారంగా నికి సంబంధించి ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ లో కేవలం సమాచారం నిమిత్తం గణాంకాలను నమోదు చేయడానికే పరిమితం కావొద్దని పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజ శేఖర్ కోరారు. అన్నివర్గాల విద్యార్థుల అభివృద్ధితో పాటు వారి భవిష్యత్ నిర్ణయించే విధంగా చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడేలా ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన 47వ యూడైస్ ప్లస్ ప్రాంతీయ వర్క్షాప్ ప్రారంభ సభలో మాట్లాడుతూ.. యూడైస్ ప్లస్ అనేది మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) నుంచి డెసిష న్ సపోర్ట్ సిస్టంకు మారాలన్నారు. మూడేళ్లగా కోవిడ్ కారణంగా ఆగిన ఈ ప్రాంతీయ స్థాయి కార్యశాలకు ఈసారి ఆంధ్రప్రదేశ్ వేదికైందని తెలిపారు. పాఠశా ల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ మాట్లా డుతూ మన రాష్ట్రంలో విద్యార్ధి ఆధారితంగా యూడై స్ ప్లస్ నమోదు జరుగుతుందన్నారు.

ఏపీ పనితీరు భేష్
కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గణాంక ప్రచురణల విభాగం (డీవోఎస్ఈ-ఎల్) డిప్యూటీ డైరెక్టర్ వెంకటరమణ హెగ్దే మాట్లాడుతూ. జనరల్ వెంకటరమణ యూడైస్ డీసీఎఫ్ (డాటా క్యాప్చర్ ఫార్మాట్)లో వివిధ అంశాలను తప్పులు లేకుండా పూర్తి చేసే విధానాన్ని, తప్పులు దొర్లటం వల్ల వివిధ జాతీయ స్థాయి డాష్ బోర్డుల్లో రాష్ట్రాల ప్రగతిపై చూపే ప్రభావాన్ని వివరించారు. యూడైస్ డేటా ఎంట్రీ విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుచూపుతో, ప్రణాళికాబద్ధంగా పని చేస్తోందని కొనియాడారు. 2021-22కు సంబంధించిన యూడైస్ డేటాను సమర్పించిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అభినం దించారు. కార్యక్రమంలో ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, కేరళ నుంచి రాష్ట్ర, జిల్లా ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం  మిగులు పోస్టులు 2,280

కొలిక్కి వచ్చిన హేతుబద్ధీకరణ
డీఎస్సీ ఆశలకు గండి

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. ఇందులో భాగంగా భారీగా పోస్టులు మిగిలిపోవడంతో అవసరం మేరకు సర్దుబాటు చేయనున్నారు. కొరత ఉన్న చోట్ల ఉద్యోగోన్నతులతో భర్తీ చేస్తారు. ఇప్పటికే అర్హులైన ఉపాధ్యాయుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. వారి నుంచి రాతపూర్వకంగా అంగీకారం కూడా పొందారు.

ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన హేతుబద్ధీకరణ భవిష్యత్తులో పోస్టుల భర్తీపై ప్రభావం చూపనుంది. ఉమ్మడి జిల్లాలో 2,280 పోస్టులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. జీవో నంబరు 117 ప్రకారం తొలుత 2,380 పోస్టులు మిగిలిన ఉన్నట్లు గుర్తించారు. కొత్తగా జారీ చేసిన జీవో 128 , పాత జీవో 117ల ప్రకారం విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకునే తేదీ, పోస్టులు కొనసాగించేందుకు కొంత వెసులుబాటు కల్పించడంతో స్వల్ప మార్పు చోటుచేసుకుంది.
ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం, ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అమలు చేయడంతో ఎస్జీటీ పోస్టుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో విద్యా ప్రమాణాలు, నాణ్యత ఎలా పెరుగుతుందని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. జాతీయ నూతన విద్యావిధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను విచ్ఛిన్నం చేయడమేనని ఆరోపిస్తున్నారు.

1998 డీఎస్సీతో..
గత బదిలీల్లో 900 పోస్టులు బ్లాక్‌ చేశారు. ప్రస్తుతం ఈ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. హేతుబద్ధీకరణతో భవిష్యత్తులో పోస్టుల భర్తీకి అవకాశాలు తక్కువ. 1998 డీఎస్సీ వారికి ఒప్పంద విధానంలో పోస్టులివ్వాలని భావిస్తున్నారు. 128 జీవో ప్రకారం 20-30 మంది విద్యార్థులున్న చోట వీరికి అవకాశం కల్పించనున్నట్లు విద్యావర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 575 మందికి 544 మంది హాజరయ్యారు. దీంతో రెగ్యులర్‌ ఎస్జీటీ పోస్టుల సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఈ క్రమంలో భవిష్యత్తులో డీఎస్సీ ఉండదన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

మార్పులివీ...
  •  ప్రాథమిక బడుల్లో తొలుత 30 మందికి ఒక్కో ఉపాధ్యాయుడినే ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత 21 నుంచి 60 వరకు ఇద్దరిని కొనసాగించేందుకు అవకాశం కల్పించారు.
  • 3-10 తరగతులకు 137 మంది, 6-10 తరగతులకు 92 మంది విద్యార్థులు పైబడి ఉంటే ప్రధానోపాధ్యాయుడి పోస్టు కేటాయిస్తారు.
  •  ఎల్‌ఎఫ్‌ఎల్‌ ప్రధానోపాధ్యాయుడి పోస్టుకు తొలుత 121 మంది విద్యార్థులు ఉండాలని నిర్దేశించారు. ఇప్పుడు ఈ సంఖ్యను 151కి పెంచారు.
  • మే నెల 5వ తేదీకి ఉన్న విద్యార్థుల నమోదు ఆధారంగా హేతుబద్ధీకరణ చేపట్టారు. ఉపాధ్యాయుల వ్యతిరేకతతో ఆగస్టు 31 నాటికి నమోదును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.
ఉత్తర్వులు రావాల్సి ఉంది
హేతుబద్ధీకరణతో మిగులు పోస్టులను అవసరం మేరకు సర్దుబాటు చేయాల్సి ఉంది. కొరత ఉన్న పోస్టుల్లో ఉద్యోగోన్నతులు కల్పిస్తాం. ఇందుకు సిద్ధం చేశాం. సర్దుబాటు, బదిలీలకు ఉత్తర్వులు రావాల్సి ఉంది.
▪️- కె.వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి డీఈవో

పిల్లలు మెచ్చే పాఠ్యాంశాలు 

సమగ్ర శిక్షా పద్ధకాన్ని రీ డిజైన్ చేసిన కేంద్ర ప్రభుత్వం 
జాతీయ విద్యా విధానం 2020 సిఫార్సులకు అనుగుణంగా మార్పులు 



20న అల్పపీడనం

తుఫాన్‌గా మారే అంశంపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత
నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో శుక్రవారం రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఈనెల 18న ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఈనెల 20న ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడనుంది. తర్వాత పశ్చిమ వాయవ్యంగా పయనించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారి ఆంధ్రప్రదేశ్‌ తీరం దిశగా రానుందని భారత వాతావరణ శాఖ ప్రత్యేక బులెటిన్‌లో పేర్కొంది. ఈనెల 19 లేదా 20న ఏర్పడనున్న అల్పపీడనం తర్వాత రెండు, మూడు రోజుల్లో ఏపీ తీరం దిశగా వచ్చే క్రమంలో మరింత బలపడుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. ఇది తుఫాన్‌గా మారుతుందా? లేదా అనేది రానున్న రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు."

ప్రైవేటు బడులపై కొరడా!

  • నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న పాఠశాలలు
  • ప్రొవిజినల్‌ గుర్తింపునకు నిబంధనల్లేవు
  • ఓపెనింగ్‌ అనుమతితోనే కొన్నిచోట్ల తరగతులు
  • లోపాలు గుర్తించిన పాఠశాల విద్యాశాఖ
  • రద్దుకు కీలక ఆదేశాల జారీ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ... ప్రైవేటులో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి కొరడా ఝులిపించేందుకు సిద్ధమైంది. అలాంటి పాఠశాలల అనుమతులను మరోసారి సమీక్షించి, నిబంధనలకు ఏమాత్రం వ్యతిరేకంగా నడుపుతున్నట్లు తేలినా వెంటనే గుర్తింపు రద్దుచేయాలని శుక్రవారం పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు పాఠశాలలకు ప్రొవిజినల్‌ గుర్తింపు జారీకి ఎలాంటి నిబంధనలూ లేకపోయినా డీఈవోలు, ఆర్జేడీలు జారీచేశారని, వాటిని యాజమాన్యాలు దుర్వినియోగం చేస్తోన్న విషయంలో క్షేత్రస్థాయిలో పరిశీలనలో వెలుగులోకి వచ్చిందని తెలిపింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు కేవలం ప్రారంభానికి అనుమతి పొంది, గుర్తింపు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నాయని, ఇది నిబంధనల ఉల్లంఘనేనని స్పష్టంచేసింది. ఇలాంటి పాఠశాలల అనుమతి కాలం ఏటా జూలైతో ముగుస్తుందని, గుర్తింపు పొందడంలో విఫలమైతే అనుమతి రద్దవుతుదని స్పష్టంచేసింది. గుర్తింపు లేని పాఠశాలలకు యూడీఐఎ్‌సఈ కోడ్‌లు కూడా ఇవ్వరని స్పష్టంచేసింది. అలాంటి పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రభుత్వ పథకాలను కోల్పోతారని తెలిపింది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలైనా ఇంకా కొన్ని పాఠశాలలు ప్రారంభానికి అనుమతి కోరుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఇలాంటి ఉల్లంఘనలను గుర్తించిన నేపథ్యంలో ఆర్జేడీలు 15 రోజుల్లో ప్రొవిజినల్‌ గుర్తింపును పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని తేలితే వెంటనే ఆ పాఠశాలల గుర్తింపును రద్దుచేయాలని ఆదేశించింది. అలాగే ఎలాంటి గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుని, ఆ నివేదికను సమర్పించాలని స్పష్టంచేసింది. ఈ ఆదేశాలను పాటించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.

కొత్తగా 250 ఎంబీబీస్ సీట్లు 

ఊదు ప్రైవేట్ కాలేజీలకే .. ఇందులో సగం కన్వీనర్ కోటా 



Tags